Tag Archives: stories

పిచుక గుణం

sparrow and crows

ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది.

మనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకో ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచుకకి స్నేహం అయ్యింది.

పిచుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు, అవి మంచివి కావు, అని. కాని ఆ పిచుక మాట వినలేదు.

ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడకి, ఎందుకు అని అడగకుండా, ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది.

కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీకా అటూ ఇటూ గెంతుతూ వుంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది.

“బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి!” అని పిచుక ప్రాధేయ పడింది. కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు.

ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు. అందుకే మనం మంచి గా వున్న, మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు.

రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో

shutterstock_551670577అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు. బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలెట్టారు.

“నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది” అని ఒకరంటే, “నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది” అని ఒకరు, “అసలు నా గుర్రానికి భయమే తెలీదు” అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు. ఒక వ్యాపారస్తుడు మరీ అతికి పోయి, “నా గుర్రం ఎగరగలదు” అన్నాడు.

వెంటనే రాజు గారు ఆ గుర్రాన్ని కొని, తనతో రాజు మహాలుకి తీసుకుని వెళ్ళారు.

మొన్నాడు నేసాధిపతిని పిలిచి, “ఈ గుర్రం ఎగురుతుంది” అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి, గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేసారు. కాని గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగర లేదు.

రాజు గారు, “అదేంటి, నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి” అని ఆదేశించారు.

వ్యాపారస్తుడిని రాజుగారి ముందరు నిలపెట్టారు. రాజుగారు, “నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒక సారి ఎగిరించి చూపించు” అన్నారు.

“మహారాజా! గుర్రం ఎగురుతుంది, అంటే నా ఉద్దేశ్యం అంత వేగం గా పరిగేడుతుందని” అని వ్యాపారస్తుడు చెప్పాడు.

రాజుగారికి చాలా కోపం వచ్చింది. “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు.

ఆ తర్వాత ముఖ్య మంత్రిని పిలిచారు. “ముఖ్య మంత్రి! నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది! ఈ పని మీరే చేయాలి!” అన్నారు.

ముఖ్య మంత్రి దంగ్ అయిపోయి, “మహారాజా! గుర్రం ఎలా ఎగురుతుంది, ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా!” అన్నారు.

మహారాజు వెంటనే, “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు.

ఇలా ఒక్కొక్కరినీ పిలవడం, వాళ్ళను గుర్రం ఎగిరించి చూపించ మానడం; వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం, కొన్ని రోజులు ఇలా గడిచాయి.

మొత్తానికి ఒక రోజు ఒక సభికుడిని పిలిచే, రాజు గారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు.

సభికుడు తల వంచి, “అలాగే మహారాజా! నాకు ఒక సంవత్సరం గడువు ఉవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను!” అని ఒప్పుకున్నాడు.

రాజు గారు సంతోషించి, ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

సభికులు, రాజ్యంలో వున్న వారందరూ ఆశ్చర్యపోయారు. “ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దెగ్గిర ఏమైనా ఉపాయముందా?” అని రక రకాల ప్రశ్నలు అడిగారు. సభికుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు.

ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో వున్న అతని భార్యకి కూడా తెలిసింది. ఆందోళనగా ఆటను ఇంటికి వచ్చే దాకా గుమ్మం మీద కాపు కాసింది. ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది.

సభికుడు నిజమే కానీ ఖంగారు పడద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు – “మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహారాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేసారూ. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది.

ఒక సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలిగింది కదా! ఆ పయిన చూద్దాం! యాడాదిలో ఏమైనా కావచ్చు. రాజు గారు ఈ విషయం మరిచిపోవచ్చు! లేదా పట్టుదల తగ్గవచ్చు! భవిష్యత్తు ఎవరు చూసారు? రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో!”

అనంతుడి కోరిక

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్నిదించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా స్మశానానికేసి నడవసాగాడు.

అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, విద్యాదికుదివైన నువ్వు, భీతగోల్పే ఈ స్మశానంలో, నిశిరాత్రి వేళ ఇన్ని కష్టాలను సాహిస్తున్నావంటే నమ్మసఖ్యం కాకుండా వున్నది. ఇంతకూ దీనికి కారకులు, నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించు కుంటున్న కుత్సిత మనస్కులై వుండాలి. అలాంటి వాళ్ళ వలలో చిక్కి, కార్యసాధన తర్వాత అవివేకం కొద్దీ తనమేలును కూడా మరచిన అనటుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను.” అంటూ ఇలా చెప్పసాగాడు:

పూర్వం మందారకమే దేశాన్ని సత్కీరుడనే రాజు పరిపాలించేవాడు. విరజుడు, సత్కరుడి ఒక్కగానొక్క కొడుకు. అతడికి కాస్త వయసురాగానే రాజు, అతణ్ణి గోబిలుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు.

anantudu_1గురుకులంలో మొత్తం పదిమంది విద్యార్దులున్దేవారు. వారిలో ఒక్క అనటుడనే విద్యార్ధి తప్ప మిగిలినవారందరూ, విరజుడు రాజుకుమారుడనే భయభక్తులతో కొంచెం ఎడంగా మసిలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు. శాంతంగా, ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చటంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది.

అయితే, విరజుడిలో తను రాజకుమారుదనన్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడూ కావడంతో, అనంతుడి మీద అప్పుడప్పుడూ అధికారం చలాయించేవాడు. అయినప్పిటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుది పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు.

విరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంతట తలకేక్కేవి కాదు. అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక, తీరిక సమయాలో అనంతుడిని వేధించేవాడు. అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరజుడికి గ్రాహ్మయ్యేలా ఒకటికి నాలుగు సార్లు భోదించే వాడు.

ఈ విధంగా విరజుడు చదువులో కాస్త చురుకుతనం పున్జుకోగానే, గురువు గోబిలుడు దాన్ని గమనించి, అతడికి మరింత ప్రోత్సాహజనకంగా వుండడం కోసం, అడపాదడపా ప్రశ్నించటం ప్రారంభించాడు. మొట్ట మొదటిసారి గురువు ప్రస్నించ గానే విరజుడు, అనంతుడితో, “అనంతా! ఈ రోజు గురువుగారు నన్ను ప్రస్నిన్చారంటే, ఆ ఘనత అంతా నీదే. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. నేను రాజునవగానే నిన్ను నా ప్రధాన మంత్రిని చేసుకుంటాను!” అన్నాడు.

విరజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు. గోబిలుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి, విరజుడిని మరింతగా మెచ్చుకుంటూ, “నాయనా, మనిషిని పశుత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత ఒకటి! నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు. ఈ రోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో” అని హితవు పలికాడు. విరజుడు అలాగేనన్నట్టు తలాడించాడు.

అయితే, ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. అతడు క్రమేపీ చదువులో కొంత రాణిస్తూ, నానాటికీ అహంకారం పెంచుకుని, అనంతుడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. అలా కొంత కాలం గడిచి, ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చేనాటికి, విరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మరిచినట్లు అందరికీ తెలిసిపోయింది.

అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే, గురువు గోబిలుడితో, “స్వామీ! నాకింకా విద్యా తృష్ణ తీరలేదు. తమరు అనుమతిస్తే, ఆరావళీ పర్వత పాదాల వడ్డన వున్న కృష్ణచంద్రులవారి గురుకులంలో కొన్నేళ్ళు విద్యాభ్యాసం చెయ్యాలని వుంది. ఆ తర్వాత అవసరమనిపిస్తే, విరజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను.” అన్నాడు.

గోబిలుడు, అనంతుడు కోరిన దానికి సంతోషంగా, “ఆ మహనీయుడి దగ్గర శిష్యరికం చేసే పరిపూర్ణమైన అర్హత నీకుంది. వెళ్లిరా నాయనా, శుభస్య శీఘ్రం!” అంటూ ఆశీర్వదించి పంపించాడు.

ఆ తర్వాత, విరజుడు కూడా గురు దక్షిణ చెల్లించి, రాజధానికి తిరిగి వెళ్ళాడు. నెమ్మదిగా ఆరు సంవత్సరాలు గడిచాయి. విరజుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజవుతూనే, తనకు పూర్తీ అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుదనేవాడిని తన ప్రధానసలహాదారుడిగా నియమించుకున్నాడు. పాలనా వ్యవహారాల్లో, ఈ ప్రధాన సలహాదారు మాట వేదవాక్యంగా చెల్లడం ప్రారంభించింది.

anantudu_2సుప్రతీకుడు, రాజూ కలిసి వినూత్న పరిపాలన పేరిట, పరిపాలనలో అనేక మార్పులూ, సంస్కరణలూ ప్రవేశపెట్టారు. ఇందువల్ల ప్రజలు లేనిపోని అయోమయావస్థ లో పడి, తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబరచ సాగారు. ఇదే ఊతంగా చేసుకుని పొరుగు రాజు, విరజుడి రాజ్యంపై దండెత్తాలను కుంటున్నాడని గూఢచారులవల్ల విరజుడికి తెలిసింది. విరజుడు కాస్త కొంగారుపడి, సుప్రతీకుడిని సంప్రదించాడు.

సుప్రతీకుడు తేలిగ్గా, “భయం ఎందుకు, ప్రభూ! మనం హేచ్చువేతనం మీద మరింత మందిని సైన్యంలో చేర్చుకుని, మనమే ముందుగా పొరుగురాజు మీద దండెత్తుదాం. ఆ రాజ్యం కూడా మనవసమైతే, తమరి కీర్తి ప్రతిష్ఠలు నలుదిశలా మరింత ఇనుమడిస్తాయి!” అన్నాడు.

“నువ్వు చెప్పెదీడీ చిటికలో ముగిసే పనికాదు. మన ఖజానాలో అంతగా నిల్వదబ్బు లేదని, నీకు తెలియనిదా?” అన్నాడు.

దానికి సుప్రతీకుడు నవ్వి, “మన ఖజానా నింపేందుకు, ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను. యక్షిణిశైలం గురించి మీకు తెలుసుగదా?” అన్నాడు.

anantudu_3విరజుడికి యక్షిణి శైలం గురించి తెలుసు. మందార దేశానికి ఉత్తరపు టెల్లగావున్న పెద్ద పర్వతాన్ని యక్షిణి శైలం గా వర్ణించి చెబుతారు. ఆ పర్వతం మీదవున్న ప్రాచీన శివాలయం ముఖమండపం దగ్గర, దేవనాగారలిపిలో వున్న ఒక శిలా శాసనం వుంది. అందులో, ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్యభాగంలో నిరంతరం వేగంగా తిరిగేసుడి ఒకటున్నది. మంత్రం తంత్ర శాస్త్రజ్ఞాని, సాహసీ, నిస్వార్థ పరుడూ అయిన యువకుడు, ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయిన్చినట్లయితే, అతడికి అష్ట సిద్ధులూ, నవనిదులూ లభిస్తాయి, పరాజితుడైతే అక్కడి నుంచి నరక కూపంలోకి తోయ బాదుతాడు, అని వున్నది.

సుప్రతీకుడి మాటలో అదంతా గుర్తు తెచ్చుకుని విరజుడు బిక్కముఖం వేసి, “యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం? ప్రాణాలకు తెగించి, ఆ కోనేటిలో దూకడం నా వల్ల కాదు!” అన్నాడు.

ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి, “అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు, ప్రభూ! అనంతుడనే యువకుడొకడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు. అతడు ఆరావళీ ప్రవత ప్రాంతంలోని కృష్ణ చంద్రుడనే గురూత్తముని వద్ద మంత్రం శాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడట. ఇతర విద్యలు కూడా అతడికి కరతలామలకాలేనట. అతడు మన వర్తకుల శ్రేష్టి ఇంట ఆతిధ్యం పొందారు. ఆ అనంతుడు గొప్ప సాహసి అనీ, ఎన్నదగ్గ నేస్వార్తపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. మనం ఆ అనంతుడిని పిలిపించి, రాజ్య క్షేమం కోసం యక్షిణి శైలికి వెళ్ళమని అడుగుదాము. నిధులతో తిరిగి వస్తే, అతడి ఎట్టు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం. ఏమంటారు?” అని అడిగాడు.

అనంతుడి పేరు వింటూనే ఉలిక్కి పడిన విరజుడు, ఒక్క క్షణం ఆలోచించి, సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు. మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది.

అనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేసాడు. తర్వాత, యక్షిణిశైలాన్ని గురించి చెప్పిన దంతా శ్రద్ధగా విన్న అనంతుడు, “ప్రభూ! మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం. మీ కోరిక ప్రకారం నేనీ యక్షిణిశైలానికి తప్పక వెళతాను,” అన్నాడు.

అన్నమాట ప్రకారం అనంతుడు ఒకానొక సుముహూర్తాన యక్షిణిశైలానికి వెళ్లి మంత్రం జపించి కోనేటిలో దిగాడు.

అనంతుడిటో బాటే వెళ్లి, కోనేటి ఒడ్డునే కూర్చున్న విరజుడికి, చాలా సేపు గడిచిన తర్వాత, అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ, కోనేటి నుంచి బయటకిరావడం కనిపించింది. అతడు వెంటనే అనంతుడి దగ్గిరకు వెళ్లి చెయ్యి పట్టుకుంటూ ఆతృత గా, “అనంతా! నిధి దొరికిందా, ఏదీ?” అంటూ ప్రశ్నించాడు.

anantudu_4అనంతుడు మందహాసం చేసి, “రండి, చూపిస్తాను, మీకెలాంటి ప్రమాదం కలగదు!” అని విరజుది చెయ్యి పట్టుకుని మళ్ళీ కోనేటిలో దిగాడు. దాని అట్టడుగున సూర్యకిరణాల్లా ప్రకాశిస్తున్న నవ రత్నాల గుట్టలు కనిపించాయి. విరజుడు మంత్రం ముగ్దుడిలా అయిపోయాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా, “ప్రభు! నేను సాధించిన ఈ అమూల్యమైన నిదినిక్షేపాల్ని, మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమంకోసం వినియోగించేందుకు, ఈ క్షణమే మీ పరంచేస్తాను. అయితే దీనికి ప్రతిఫలంగా, మీ నుంచి నాకు కావలసింది బంగారం మాత్రం కాదు!” అన్నాడు.

ఆ మాటలకు విరజుడు చాలా ఆశ్చర్యపోతూ, “మరేమి కావాలి?” అని ప్రశ్నించాడు? మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం, నన్ను మీ ప్రదానామాత్యుడిగా నియమించుకొంది. అదే నాకు   కావలసింది!” అన్నాడు అనంతుడు గంభీరంగా.

విరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోటమాట రాని వాడిలా వుండిపోయి, తర్వాత కాళ్ళ నీళ్ళు పెట్టుకుని వంగి అనతుడి పాదాలు స్పృశించి, “మహానుభావా! నువ్వు సామాన్య మానవుడివి కావు. ఈ క్షణం నుంఛీ నువ్వే నా ప్రధాన మంత్రివి! నీ అనుజ్ఞ లేనిదే నేనిక ఊపిరి సైతం పీల్చను!” అన్నాడు.

బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, నిధి సంపాదనలో, విరజుడి స్వార్థం తేట తెల్లమవుతూనే వుంది. ఎటొచ్చి ఎంతో విద్యాధికుడూ, సాహసీ అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనబడుతున్నది. అతడు నిస్వార్థ పరుడైన పక్షంలో నిధుల్ని విరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్లి పోవాలి. లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి. అదీ గాక ఇదీ గాక, విరజుడు కపటి, అతడు చేసే వాగ్దానాలకు విలువలేదని ఎరిగి, మంత్రి పదవి కోరడం ఏమన్నా విజ్ఞత అనిపించు కుంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావా, నీ తల పగిలి పోతుంది!” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “అనంతుడు మొదటి నుంఛీ రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థ పరుడు. అందుకే అతడు, భావి మహారాజైన విరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు. విరజుడు కపటి, స్వార్థ పరుడు కావచ్చు. కాని, అప్పటి పరిస్థితుల్లో, ప్రజల వ్యతిరేకత, ఖజానాలో దానం లేకపోవడం, పొరుగురాజు దండ యాత్ర భయం, పాలనా వ్యవహారాల్లో సుప్రతీకుడి లాంటి అల్పగ్నుడి సలహాలు – వీటన్నిటి కారణంగా దేసరక్షణకు తనలాంటి వాడి అవసరం ఉన్నదన్న గట్టి నమ్మకం తోనే, అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది అతడి దేసభాక్తిని, రాజకీయ పరిజ్ఞాతాన్నీ చాటి చెబుతుంది. ఇది గొప్ప వివేకం. అవివేకం అంటూ ఇందులో ఏ మాత్రం లేదు!” అన్నాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు.

anantudu_5

Source: Chandamama, February 2004.
 

కోతుల టోపీలు

shutterstock_476785555

ఒక టోపీలు అమ్ముకునే అతను ఉండేవాడు. అతను అన్ని ఊళ్లూ తిరుగుతూ, అన్ని చోట్లకీ వెళ్లి టోపీలు అమ్ముతూ ఉండేవాడు.

ఒక రోజు అలాగే వ్యాపార పరంగా ప్రయాణం చేస్తుంటే అలసట అనిపించింది. మండుతున్న సూర్యుడు, భగ్గున ఎండ, ఆకలి, దాహం అన్నీ కలిసి పాపం అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి.

దారిలో ఒక చెట్టు నీడలో ఆగి, తెచ్చుకున్న భోజనం తిని, మంచినీళ్ళు తాగి, తన టోపీల బస్తా పక్కన పెట్టుకుని, చెట్టు నీడ లో హాయిగా నిద్రపోయాడు.

కొంచం సేపటికి లేచి చూస్తే బస్తా లో ఒక్క టోపీ కూడా లేదు. అన్ని టోపీలు ఎవరో కొట్టేసారు. ఎవరై ఉంటారని దిక్కులు చూస్తుంటే చెట్టుపై చప్పుడు వినిపించింది. పైకి చూస్తే చెట్టు నిండా కోతులు ఉన్నాయి. ఊరికే ఉన్నాయా? ఒకొక్క కోతి తల మీదా ఒకొక్క టోపీ వుంది.

ఓహో ఇదా సంగతి అని టోపీలు అమ్ముకునే అతను “నా టోపీలు నాకు తిరిగి ఇచ్చేయండి” అని కోతులతో అన్నాడు.

అవి మాట వినే రకమా? గమ్మున కూర్చున్నాయి.

కోపంగా అతను అరిచాడు.

అవీ తిరిగి అరిచాయి.

చప్పట్లు కొట్టాడు.

అవీ కొట్టాయి.

ఒక రాయి విసిరాడు.

కోతులు చెట్టుకున్న పళ్ళు తిరిగి విసిరాయి.

కొడతానని బెదిరించాడు.

కోతులు నవ్వాయి.

చివరికి ఏమి చేద్దామా అని ఆలోచిస్తూ అలవాటు ప్రకారం ఒక చేత్తో తన తలపైనున్న టోపీ తీసి, ఇంకో చేత్తో తల గోక్కున్నాడు.

కోతులూ అలాగే చేసాయి.

ఠప్పున ఐడియా వచ్చి, తన చేతిలో వున్న టోపీ నేల మీదకి విసిరే సాడు.

వెంటనే కోతులు కూడా వాటి చేతుల్లో ఉన్న తోపీలను నేల మీదకు విసిరేశాయి.

టోపీలు అమ్ముకునే అతను గబ గబా ఆ టోపీలన్నీ మళ్ళి బస్తాలో వేసేసుకుని, వెనక్కి తిరిగి చూడకుండా పరుగో పరుగున పారిపోయాడు!

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce

దేవుడా! కాపాడు!

shutterstock_584047801

ఒక వ్యాపారస్తుడు తన పనివాడితో ఎడ్లబండి మీదా అమ్మవలసిన సరుకులు వేసుకుని పోరుగూరిలోని సంతకి బయలుద్యారాడు.

దారి సరిగ్గా లేదు. చాలా గోతులు, గుంటలు వున్నాయి. వాన మూలంగా వాటిల్లో నీళ్ళు నిలిచి పోయాయి. జాగ్రత్త గా, నిదానంగా బండి తోలుకుంటూ కొనసాగారు. అందు మూలంగా అనుకున్నంత వేగంగా వెళ్ళలేక పోతున్నారు. ఇలా ఆలస్యం అయితే కొట్టు పెట్టుకోవడానికి మంచి చోటు దొరకక పోవచ్చని, సంతలో లాభం తగ్గిపోతుందేమో అని వ్యాపారస్తుడు చాలా దిగులుగా వున్నాడు.

ఉన్న కష్టాలు సరిపోవు అన్నట్టు హటాత్తుగా బండికున్న ఒక చక్రం గుంటలో దిగి మట్టిలో ఇరుక్కు పోయింది.

వ్యాపారస్తుడు ఎద్దులని ముందుకు నెట్టిన కొద్ది చక్రం ఇంకా ఇంకా కూరుకుపోతోంది. ఉన్న సమయం తక్కువ. మధ్యలో ఈ గొడవ.

వ్యాపారస్తుడు చేతులు జోడించి మనసంతా పెట్టి దేవుడిని ప్రార్థించాడు.
“దేవుడా! ఎలాగైనా ఈ ఆపాద నుంచి కాపాడు తండ్రి!” అని మొక్కుకున్నాడు.

దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “ప్రతి చిన్న దానికి నన్ను తలుచు కోవడం ఎందుకు? నువ్వు బండి మీద కూర్చుని సమస్య అదే తీరిపోవాలంటే ఎలా కుదురుతుంది? ఒకళ్ళు దిగి మట్టిలోంచి చక్రం తోయ్యండి, మరొకరు చిన్నగా ఎడ్లని ముందుకు తోలండి.” అని సలహా ఇచ్చి అదృశ్యం అయిపోయాడు.

పనివాడు దిగి చక్రం వెనుక భుజం పెట్టి చక్రాన్ని మట్టిలోంచి తోసాడు. వ్యాపారస్తుడు అదే సమయాన్న యెద్దులను ముందుకు నెట్టాడు. చక్రం గుంటలోంచి బయట పడి బండి మళ్ళీ కదలడం మొదలెట్టింది.

అలా ఆ రోజు వ్యాపారస్తుడు సంతకీ వెళ్ళాడు, సరుకు అమ్ముకున్నాడు, లాభాలూ సంపాదించుకున్నాడు.

సమస్య వచ్చినప్పుడల్లా “దేవుడా! కాపాడు!” అనుకోకుండా మనకు తగ్గ కృషి మనం చేస్తే ఆ పై భగవంతుడు ఎలాగా అడగ కుండానే సహాయం చేస్తాడు.

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

చీమ సహాయం

the grateful ant

ఒక పక్షి చెరువులో నీళ్ళు తాగుతుంటే అక్కడ అకస్మాతుగా ఒక చీమ నీళ్ళల్లో పాడడం చూసింది. పాపం చిన్న చీమ నీళ్ళల్లో ఈద లేక కాళ్ళూ, చేతులు కొట్టుకుంటోంది.

జాలి పడి ఆ పక్షి చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. చుట్టూ పక్కల వెతికి ఒక ఆకునే తీసుకుని వచ్చి చీమ దెగ్గిరగా పడేసింది.

చీమ నీళ్ళల్లో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది. చిన్నగా ఆకు మీదకి ఎక్కి ఆకు తేలుకుంటూ చెరువు వొడ్డు మీదకు చేరే దాకా ఆ ఆకుని గట్టిగా పట్టుకుంది. వొడ్డుకి చేరి పక్షికి కృతజ్ఞత తెలియ చేసింది.

రోజులు గడిచేయి. కాలా క్రమేణ పక్షి చీమకు చేసిన సహాయం మర్చిపోయింది. కానీ చీమ మట్టుకు గుర్తు పెట్టుకుంది.

ఒక రోజు అదే పక్షి చీమకి మళ్ళీ కనిపించింది. పలకరిద్దామని దేగ్గిరకి వెళ్తే చెట్టు వెనుక ఒక మనిషి పక్షిని రాయితో కొట్టి చంపాలన్నే ఉద్దేశం తో లక్ష్యం తీసుకుంటూ కనిపించాడు. గబా గబా చీమ మనిషి పాదం ఎక్కి కూర్చుంది. సరిగ్గా రాయి విసరపోతున్న సమయం చూసుకుని గట్టిగా చీమ మనిషిని కుట్టింది.

నొప్పితో మనిషి ఒకటే సారి అరిచాడు. దానితో పాటు గురి తప్పి రాయి కూడా అవతలేక్కడో పది పోయింది.

మనిషి అరుపు విని పక్షి కూడా ఎగిరిపోయింది.

అలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది.

మంచి వాళ్ళు ఎప్పుడు పొందిన సహాయం మర్చిపోరు.

(Image in this story is a composite created with free Bing clip art  – any copyright violations are unintentional and image will be removed if you let me know.)

విన్నవన్నీ నిజం కాదు

wolf outside house

ఒక రోజు తోడేలు ఆహారం వెతుక్కుంటూ ఒక గ్రామం వేపు వెళ్ళింది. అక్కడ ఒక ఇంటి దెగ్గిర తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని వెతకడం తోడేలుకి అలవాటు.

ఇంట్లో ఖిడికి లోంచి ఒక పాప ఏడుపులు వినిపించాయి. కుతూహలం కొద్దీ ఏం జరుగుతోందో చూద్దామని ఖిడికి లోపలకి తొంగి చూసింది.

అక్కడ పాపని తల్లి ఎత్తుకుని, భుజం తడుతూ లాలిస్తోంది. ఏమి చేసిన పాప ఊరుకోవటం లేదు. చివరికి కొంచం విసుక్కుంటూ, “ఊరుకో పాపా, ఊరుకో – లేకపోతే మన ఇంటి చుట్టూ తిరుగుతూ వుంటుందే, ఆ తోడేలుకి నిన్ను ఇచ్చేస్తాను! అది నిన్ను తినేస్తుంది!” అని తల్లి పాపని మందలించింది.

ఇది విన్న తోడేలుకి ఆశ కలిగింది. ఎప్పటికో అప్పటికి తల్లి పిలిచి పాపని తన చేతిలో పెడుతుందని ఊహించుకుంటూ పాప ఎడుస్తున్నంత సేపు ఖిడికి బైట కూర్చుని ఎదురు చూస్తూనే వుంది.

కొంత సేపటికి పాప ఇంకా ఏడుపు ఆపక పొతే తల్లికి అన్న మాటలకు బాధగా అనిపించి, “ఊరుకో పాప, ఊరుకో. తోడేలుకి నిన్ను ఇవ్వనులే, మీ నాన్నగారికి చెప్పి తోడేలుని బాగా కొట్టమని చెప్తాను” అని బుజ్జగించడం మొదలెట్టింది.

ఈ మాట విన్న తోడేలు హడిలి పోయింది. అప్పుడే ఇంటికి పాప తండ్రి తిరిగి వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. పరుగో పరుగుమని తోడేలు అడివిలోకి పారిపోయింది.

మనం విన్న మాటలన్నీ నిజమనుకోకూడదు. సమయానుకూలంగా వాటిని పరిశీలించాలి.

Image: Aga Es/Shutterstock, used under license from Shutterstock.com. Image has been modified to add mother/child silhouette in window to illustrate this story. Please do not copy or reproduce.

పిల్లికి గంట ఎవరు కడతారు?

belling the cat_2

ఒక అడివిలో ఎలుకల్లన్నీ విసుకెత్తిపోయి వున్నాయి. పిల్లి వచ్చి రోజు వాటిని తరిమి తరిమి ఇబ్బంది పెడుతోంది. రోజుకొక ఎలకని తినేస్తోంది. అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి. ముఖ్య విషయం: పిల్లి నుంచి తప్పించుకోవడం ఎలా?

ఒక ఎలుక సభ వేదిక మీదకి ఎక్కింది. ఎలుకలకు వేదిక అంటే ఏముంటుంది – పక్కన ఉన్న ఒక బండ ఎక్కి, మిగితా ఎలుకలకి ఒక సలహా ఇచ్చింది.

“పిల్లి మెడలో ఒక గంట కడితే ఎలా వుంటుంది? పిల్లి ఎటువైపు నుంచి వచ్చినా గంట చప్పుడుతో ఇట్టే పిల్లి వస్తున్నట్టు తెలిసిపోతుంది! అప్పుడు ఎలుకలన్నీ వెంటనే దాక్కోవచ్చు. కొన్ని రోజులకి ఆహారం లేక పిల్లి ఎటైన వెళ్ళిపోతుంది” అని వేదిక మీంచి ఎలుక సలహా ఇచ్చింది.

ఈ ఐడియా అందరికి చాలా నచ్చింది. వెంటనే ఎలుకలన్నీ చర్చించుకున్నాయి. గంట ఎలా వుండాలి, ఎక్కడ దొరుకుతుంది, యెంత పెద్ద దైతే బాగుంటుంది, యెంత దూరం నుంచి వినిపిస్తుంది, ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకున్నాయి.

ఇంతట్లో ఒక ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది. “పిల్లికి గంట ఎవరు కడతారు?” అని అడిగింది.

పిన్ డ్రాప్ సైలెన్స్. ఎలుకలన్నీ చడీ చప్పుడు చేయకుండా నిశబ్దంగా ఒకరి ఒంక ఒకరు చూసుకున్నారు. పిల్లికి గంట ఎవరు కదతారన్న ప్రశ్న కు సమాధానం ఎవ్వరికి తట్టలేదు.

సమావేశం ముగించుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లి పోయారు.

ఉచిత సలహాలు ఇవ్వడం సులువే, కానీ అన్ని సలహాలు పాఠింప దగ్గవి కాదు.

(Image in this story is a composite created with free Bing clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)

జింక కొమ్ములు

Stags antlers

ఒక రోజు ఒక మగ జింక చెరువులో నీళ్ళు తాగుతూ తన ప్రతిబింబం చూసుకున్నాడు. చూస్తూ ముగ్ధుడై పోయాడు.

నా కొమ్ములు యెంత అందంగా వున్నాయి, నా తలపై కిరీటంలా వున్నాయి, అనుకుంటూ చాలా సేపు చూసుకున్నాడు.

చివరికి కాళ్ళు కూడా ప్రతిబింబం లో కనిపించాయి.

“ఛీ! ఇంత అందంగా వున్న నాకు దేవుడు ఇలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు!” అని తన కాళ్ళను తనే అసహ్యించుకున్నాడు.

కొంత సేపు అయ్యాక చెరువు దేగ్గిరకి నీళ్ళు తాగడానికి వస్తున్న పులి వాసన మగ జింకకు తగిలింది.

భయంతో పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి అడవిలోకి పారిపోయాడు.

అప్పుడు ఆ మగ జింకకి అర్ధం అయ్యింది. అందంగా వున్న కొమ్ముల కన్నా అవలక్షణం అనుకున్న కాళ్ళే ఎక్కువ పనికొచ్చాయి, అందుకే దేవుడు కాళ్ళు ఇచ్చాడు అని.

మనం కూడా అందం కన్నా గుణం మెచ్చుకోవడం నేర్చుకోవాలి.

(Image in this story is a composite created with Bing clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)

కొంగ కోరికలు

Picky Crane

ఒక రోజు కొంగకి ఆకలి వేసింది. చెరువులో నుంచుని ఏ చాపను తినాలా అని చూసింది.

ఆ రోజు చెరువులో చాలా చేపలు వున్నాయి. కాని ఆ రోజు కొంగ చాలా అసంతృప్తిగా వుంది.

చూసిన ప్రతి చేపకి కొంగ ఏదో వంక పెట్టుకుంది. పక్క నుంచి ఒక చేప వెళ్తుంటే, “ఈ చేప మరీ చిన్నగా వుంది”, అనుకుని వదిలేసింది. “ఏదైనా మంచి, పెద్ద చేప పడదాము” అనుకుంది.

అలాగే, ఈ చేప మరి సన్నం గా వుంది, ఈ చేపకి చారలున్నాయి, ఈ చేపకు అస్సలు చారలు లేవు, ఇది చిన్న గా వుంది, ఇది లావుగా వుంది … ఇలా అనుకుంటూ వంకలు పెట్టుకుంటూ ఏ చాపని పట్టలేదు. అన్నిటిని వదిలేసింది. ఏదైనా “మంచి” చేప కోసం ఎదురు చూస్తూ కొంగ జపం చేస్తూ కూర్చుంది.

మధ్యాన్నం అయ్యే కొద్ది ఎండ ఎక్కువైంది. వడ్డు దెగ్గిర తక్కువ లోతు నీళ్ళల్లో ఈదుతున్న చేపలన్నీ చెరువు మధ్యలో ఉన్న లోతు నీళ్ళల్లోకి వెళ్ళిపోయాయి.

క్రమేపి కొంగకి ఏ చేపా కనిపించలేదు.

ఆ రోజు కొంగ ఆకలి గానే ఉంది. చివరికి ఒక నత్త కూడా దొరకక, ఏమి తినకుండానే పడుక్కుంది.

ఒక్కొక్క సారి మనకు దక్కిన దానితో సంతృప్తి పడడం మంచిది. మరీ కచ్చితంగా వుంటే మనకు నచ్చినది దొరక్క పోవచ్చు.

(Image in this story is a composite created with free Bing clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)